Amala | టాలీవుడ్ అందాల నటి, ప్రఖ్యాత సీనియర్ యాక్ట్రెస్ అమల అక్కినేని ప్రస్తుతం సినిమాలకంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మూడేళ్ల క్రితం విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో ఆమె చివరిసారిగా తెరపై కనిపించారు. అప్పటి నుంచి కొత్త సినిమాలకు సైన్ చేయకపోయినా, ఆమె పబ్లిక్ లైఫ్లో చురుకుగా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల అక్కినేని, తన కోడళ్లైన శోభిత ధూళిపాల నాగ చైతన్య భార్య), జైనబ్ (అఖిల్ అక్కినేని భార్య) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమల మాట్లాడుతూ.. “నాకు అద్భుతమైన కోడళ్లు ఉన్నారు. వాళ్లు మంచి వ్యక్తిత్వం కలవారు. వాళ్ల వల్ల నా జీవితం కొత్తగా అనిపిస్తోంది. మా ఇంట్లో ఇప్పుడు నాకు ‘గర్ల్స్ సర్కిల్’ ఏర్పడింది,” అంటూ నవ్వుతూ చెప్పారు.
అమల తన స్వభావం గురించి చెబుతూ .. “నా కోడళ్లు ఇద్దరూ చాలా బిజీగా ఉంటారు, అది మంచి విషయం. యువత ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉండటం అవసరం. వాళ్లు తమ పనుల్లో బిజీగా ఉంటే నేను నా పనుల్లోనే ఉంటాను. సమయం దొరికినప్పుడు మేమంతా కలిసి సరదాగా గడుపుతాం. నేను డిమాండ్ చేసే అత్తను కాదు… అలాగే డిమాండ్ చేసే భార్యను కూడా కాదు,” అంటూ చిరునవ్వుతో చెప్పారు. తన కుమారులు నాగ చైతన్య, అఖిల్ గురించి అమల గర్వంగా మాట్లాడారు. “వాళ్లు ఇద్దరూ అద్భుతమైన యువకులుగా ఎదిగారు. నాగార్జున గారికి వాళ్లపై అపారమైన ప్రేమ ఉంది. నేను నా బాధ్యతల పట్ల కచ్చితంగా ఉంటాను. పిల్లల విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం వహించను అని పేర్కొన్నారు.
నాగార్జున 1984లో లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. 1990లో విడిపోయిన తర్వాత 1992లో నటి అమల అక్కినేనిని వివాహం చేసుకున్నారు. నాగ చైతన్య 2024లో నటి శోభిత ధూళిపాల ను వివాహం చేసుకున్నారు. హైదరాబాద్లో జరిగిన ఆ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఇక 2025లో అఖిల్ అక్కినేని, ముంబైకి చెందిన ఆర్టిస్ట్, ఎంట్రప్రెన్యూర్ జైనబ్ ను పెళ్లి చేసుకున్నారు. ఇటీవల సినిమాల కంటే కుటుంబ జీవనాన్ని ఆస్వాదిస్తున్న అమల, తన ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నారు. “ఇప్పటి నా జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతోంది” అంటూ ఇంటర్వ్యూను ముగించారు అమల.