పవన్కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా ‘ఖుషి’. భూమిక నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ సూర్య మూవీస్ పతాకంపై నిర్మించారు ఏఎం రత్నం. ఎస్జే సూర్య దర్శకుడు. 2001లో విడుదలై ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని ఈ నెల 31న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాణంలో తన అనుభవాలు రీకాల్ చేసుకున్నారు నిర్మాత ఏఎం రత్నం. ఆయన మాట్లాడుతూ…‘మేము ఖుషి సినిమా అనుకునే సమయానికే పవన్ స్టార్ హీరో అయ్యారు. ఆయన ఈ కథ విని సంతోషంతో చప్పట్లు కొట్టారు. ముందు ఈ సినిమాకు అనుకున్న పేరు ముత్తమ్ (ముద్దు). అయితే ప్రేక్షకులందరూ కనెక్ట్ అయ్యేలా టైటిల్ ఉండాలని ‘ఖుషి’గా మార్చాం. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య అహంకారం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయనే కథను దర్శకుడు ఎస్జే సూర్య యువతను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు.
నా దృష్టిలో ఈ కథ ఎప్పటికీ అద్భుతమే. వాయిస్ ఓవర్తో కథను చెప్పేసి చివరి దాకా ప్రేక్షకుల్ని అలా కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. మణిశర్మ పాటలు సినిమాకు రిలీజ్ ముందు చాలా హైప్ తీసుకొచ్చాయి. లండన్లో రిలీజైన తొలి తెలుగు సినిమా ఇదే. ఒక స్టార్ హీరో ఐకానిక్ మూవీని రీ రిలీజ్ చేయడం వల్ల అభిమానులు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. పవన్ బర్త్డేకు జల్సా రీ రిలీజ్ చేశారు. దాంతో పోటీ వద్దనే ఇప్పుడు విడుదల చేస్తున్నాం. నా కెరీర్లో ‘జీన్స్’, ‘ప్రేమికుల రోజు’, ‘బాయ్స్’, ‘ఖుషి’ చిత్రాలు యువ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ఒక భాగంగా మిగిలిపోయాయి. నిర్మాతగా ఈ సినిమా విజయం నాకెంతో సంతృప్తిని అందించింది, మా సంస్థను మరింత బలంగా నిలబెట్టింది’ అన్నారు.