Allu Sirish | అల్లూ వారింట పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రేయసి నయనికా రెడ్డితో ఈ నెల 6న శిరీష్ వివాహం ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా అల్లూ కుటుంబం హైదరాబాద్లోని అల్లూ స్టూడియోస్లో భారీ స్థాయిలో ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ను నిర్వహించింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, మోహన్ బాబు, నాని, నాగ చైతన్య, గోపీచంద్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. దర్శకుల్లో కె. రాఘవేంద్రరావు, అట్లీ, వి.వి. వినాయక్ పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ కూడా ఈ వేడుకలో కనిపించారు.
రాజకీయ వర్గాల నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, ఏపీ ఉప సభాపతి రఘురాకృష్ణరాజు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. టొవినో థామస్ హీరోగా తెరకెక్కించిన సూపర్ హీరో చిత్రం మిన్నల్ మురళితో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బాసిల్ జోసెఫ్ ఈ వేడుకలో కనిపించడంతో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
ఇటీవల అల్లు అర్జున్ హీరోగా బాసిల్ జోసెఫ్ ఓ సూపర్ హీరో కథను తెరకెక్కించబోతున్నారన్న వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ‘శక్తిమాన్’ పేరుతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సిద్ధమవుతోందని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని బాసిల్ గతంలో స్పష్టం చేశారు. అయినప్పటికీ శిరీష్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో బన్నీ స్వయంగా బాసిల్ను అందరికీ పరిచయం చేయడం మళ్లీ ఆ ప్రాజెక్ట్పై ఊహాగానాలకు తెరలేపింది. ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ ప్రకారం, బన్నీ–బాసిల్ జోసెఫ్ కాంబినేషన్లో ప్రాజెక్ట్కు సంబంధించిన చర్చలు మళ్లీ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ రెండు భారీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. ఒకటి అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ హీరో పాన్ వరల్డ్ చిత్రం కాగా, మరొకటి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్. ముఖ్యంగా అట్లీతో చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.