Allu Sirish-Nayanika | టాలీవుడ్లో మరో మెగా వేడుకకు రంగం సిద్ధమైంది. హీరో అల్లు శిరీష్.. నయనికా వివాహ వేడుక మార్చి 6న జరగనుండగా, ఇప్పటికే పెళ్లి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ–రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా మారింది. మార్చి 2న సాయంత్రం నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ అద్భుతమైన అలంకరణలతో కళ్లుచెదిరేలా జరిగింది. సంప్రదాయబద్ధంగా ఆధునిక శైలితో తీర్చిదిద్దిన వేదిక, ప్రకాశవంతమైన లైటింగ్, పుష్పాల అలంకరణల మధ్య ఈ వేడుక మరింత వైభవంగా కనిపించింది. అతిథులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
సోదరుడి పెళ్లి వేడుక ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నాడు అల్లు అర్జున్. అతిథులను స్వయంగా ఆహ్వానిస్తూ, ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ అన్నగా తన బాధ్యతను నిర్వర్తించాడు. ఆయన సాన్నిహిత్యం వేడుకకు ప్రత్యేక హంగు తెచ్చింది. అలాగే ఆయన సతీమణి స్నేహా రెడ్డి సంప్రదాయ దుస్తుల్లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు. అతిథులతో ముచ్చటిస్తూ వేడుకలో చురుకుగా పాల్గొన్నారు. అయ్యప్ప మాలలో హాజరైన రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదేవిధంగా అక్కినేని నాగార్జున, సురేష్ బాబు, నాని, సాయిధరమ్ తేజ్ వంటి ప్రముఖులు రిసెప్షన్లో సందడి చేశారు. హాస్య బ్రహ్మగా పేరుగాంచిన బ్రహ్మానందం సరదాగా ముచ్చటిస్తూ నవ్వులు పంచారు.
ఇక వేడుకలో మరో ప్రత్యేక దృశ్యం ఆకట్టుకుంది. నందమూరి బాలకృష్ణ, అల్లు అరవింద్ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఇద్దరి మధ్య నవ్వులు అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి. దర్శకుడు బుచ్చిబాబు సన, హీరో శ్రీ విష్ణు, కమెడియన్ అలీ ప్రముఖ యాంకర్ సుమ కనకాల కూడా హాజరై వధూవరులకు ఆశీస్సులు అందించారు. సినీ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు ఒకేచోట చేరడంతో ఈ రిసెప్షన్ నిజంగా తారల సమ్మేళనంగా మారింది. మొత్తంగా చూస్తే, అల్లు శిరీష్–నయనికా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ టాలీవుడ్లో ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిగిన వేడుకలలో ఒకటిగా నిలిచింది. అగ్ర నటులు, నిర్మాతలు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అభిమానుల్లోనూ ఉత్సాహాన్ని నింపింది.మార్చి 6న జరగనున్న వివాహ వేడుక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.