అల్లు అర్జున్ ‘పుష్ప-2’ వచ్చే ఏడాది ఆగస్ట్ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నటించనున్న విషయం కూడా విదితమే. త్వరలో మొదలు కానున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్ వెలుగు చూసింది. హారిక-హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పీరియాడికల్ డ్రామాగా స్వాతంత్య్ర సమరం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నదనే వార్త గతంలోనే వినిపించింది. ఆ వార్తకు బలాన్నిస్తూ, రూ. 300 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమా నిర్మించనున్నారని తెలిసింది.
పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా నిర్మించనున్నారట. ‘పుష్ప-2’ తర్వాత బన్నీ చేయబోతున్న ఈ చిత్రానికి యూనివర్సల్ అప్పీల్ ఉండేలా త్రివిక్రమ్ జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో కథానాయికగా త్రిషను తీసుకోనున్నారట. దర్శకుడిగా త్రివిక్రమ్ రెండో చిత్రం ‘అతడు’లో త్రిష నటించిన విషయం తెలిసిందే. పద్దెనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో త్రిష నటించనుందని తెలిసింది.