మాస్, యాక్షన్ ఎంటర్టైనర్స్కు పెట్టింది పేరు అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను. ఉత్తమాభిరుచితో కూడిన జనరంజకమైన చిత్రాల్ని తెరకెక్కించడంతో సిద్ధహస్తుడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. వీరిద్దరిది బ్లాక్బస్టర్ కాంబినేషన్. తాజాగా ఈ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్నది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ తెరకెక్కించిన ‘సరైనోడు’ (2016) చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా చేయబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.