Allu Arvind | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబయికి మకాం మారుస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా ముంబయిలో జరగనుండటంతో, చిత్రీకరణ సౌలభ్యం కోసం ఆయన తరచుగా అక్కడకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ముంబయిలో ఓ ఖరీదైన ఇల్లు కొన్నారని, ఇకపై అక్కడే స్థిరపడతారని ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఈ వార్తలను అల్లు అరవింద్ పూర్తిగా కొట్టిపారేశారు. బన్నీ పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారని, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ హైదరాబాద్లోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అన్ని సౌకర్యాలు ఉన్న సొంత ఊరిని వదిలి ముంబయికి వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ముంబయిలో ఇల్లు కొన్నారనేది కేవలం పుకారు మాత్రమేనని, షూటింగ్ సమయంలో బస చేయడానికి ఒక లగ్జరీ హౌస్ను అద్దెకు తీసుకున్న మాట నిజమేనని సినీ వర్గాల సమాచారం. మరోవైపు బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్పై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ స్పష్టతతో అల్లు అర్జున్ ముంబయి షిఫ్టింగ్ వార్తలకు తెరపడింది.