అల్లు అర్జున్ కథానాయకుడిగా విలక్షణ చిత్రాల దర్శకుడు సుకుమార్ నిర్దేశకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. వైవిధ్యమైన కథాంశంతో వాస్తవికతకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీర్చిదిద్దేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. కథా పరిధిని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొన్ని సన్నివేశాలు మినహా మొదటి భాగానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. పాన్ ఇండియన్ స్థాయిలో 250 నుంచి 270 కోట్ల భారీ బడ్జెట్తో రెండు భాగాల్ని నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ పేరుతో ప్రత్యేక వీడియోను విడుదలచేశారు. యూట్యూబ్లో ఇప్పటివరకు ఈ వీడియోను అరవై మిలియన్లకు పైగా వీక్షించారు. తక్కువ వ్యవధిలోనే అత్యధిక వీక్షణల్ని పొందిన వీడియోగా నిలిచింది. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దక్షిణాది భాషలతో పాటు హిందీలో ఈ సినిమా విడుదలకానుంది.