Allu Arjun | పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు సంబంధించిన ‘ప్రోటోకాల్’ వివాదం ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆయనను కలవాలంటే 40కి పైగా కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటాయని వచ్చిన వ్యాఖ్యలు అప్పట్లో భారీ వివాదానికి కారణమయ్యాయి. ఇప్పుడు మరో వీడియో వైరల్ కావడంతో ఆ వివాదం మళ్లీ నెట్టింట హాట్ టాపిక్గా మారింది. కొద్ది రోజుల క్రితం ఒక పాడ్కాస్ట్లో బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరీ బారువా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ను కలవడానికి ముందుగా తమకు 42 నిబంధనలతో కూడిన ప్రోటోకాల్ లిస్ట్ ఇచ్చారని, ఆయనతో మాట్లాడే విధానం నుంచి ఫోటోషూట్ వరకు అనేక నియమాలు పాటించాల్సి వచ్చిందని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు దీనిని సెటైరికల్గా తీసుకుంటే, మరికొందరు అల్లు అర్జున్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ వివాదం పెరగడంతో అల్లు అర్జున్ టీమ్ వెంటనే స్పందించింది. కావేరీ బారువా చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని, అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ అందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని, ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఇదే సమయంలో టాలీవుడ్కు చెందిన కొందరు ప్రముఖులు కూడా అల్లు అర్జున్కు మద్దతుగా మాట్లాడారు. ఆయనను ఎప్పుడు కలిసినా సరదాగా మాట్లాడతారని, ఇలాంటి కఠిన నియమాలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కావేరీ బారువా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు తెలిపారు.
ఈ వివాదం ముగిసిందనుకునేలోపే తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైదరాబాద్లోని కోకాపేటలో ప్రారంభమైన ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అల్లు కుటుంబం మొత్తం హాజరైంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో కలిసి వచ్చారు. ఆ సమయంలో వారి పక్కన కొందరు వ్యక్తులు నడుస్తుండగా అల్లు అర్జున్ ఒక్కసారిగా వెనక్కి చూడటంతో వారు వెంటనే ఆగి కొంత దూరంగా జరిగారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. “అల్లు అర్జున్ కంటి సైగతోనే వాళ్లను ఆపేశారు”, “భాయ్ పక్కన నడవడానికి ఎంత ధైర్యం” అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో గతంలో వచ్చిన 40కి పైగా ప్రోటోకాల్ నిబంధనల వార్తలు నిజమేనా అనే చర్చ మరోసారి మొదలైంది.
ఈ వివాదంపై తాజాగా అల్లు అర్జున్ మేనేజర్ శరత్ చంద్ర కూడా స్పందించారు. అల్లు అర్జున్ను కలవడానికి ప్రత్యేకంగా ఎలాంటి కఠిన నిబంధనలు లేవని స్పష్టం చేశారు. ఆయనను కలవడం కష్టమనే ప్రచారం పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉందని అన్నారు. ఈ విషయాన్ని అనవసరంగా పెద్దదిగా చూపిస్తున్నారని, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన వివరించారు.
Allu couple at the #AlluCinemas launch.@alluarjun @GeethaArts pic.twitter.com/5C9P2RMnfw
— M9 NEWS (@M9News_) March 12, 2026