Allu Arjun | టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్కు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘పుష్ప-2: ది రూల్’ స్పెషల్ ప్రీమియర్ సందర్భంగా చోటుచేసుకున్న విషాద ఘటనకు సంబంధించిన కేసును విచారిస్తున్న హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు అల్లు అర్జున్కు సమన్లు జారీ చేయగా, జూన్ 22న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే పలు షూటింగ్స్తో బిజీగా ఉన్న క్రమంలో నేడు బన్నీ డుమ్మా కొట్టాడు. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని బన్నీ కోర్టుని కోరినట్టు తెలుస్తుంది. మరోవైపు కేసుకి సంబంధించిన మిగతా వారంతా హాజరై బాండ్లపై సంతకాలు చేశారు. ఈ క్రమంలో కేసుని విచారించిన న్యాయమూర్తి జూలై 6కి వాయిదా వేశారు.
2024 డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో ‘పుష్ప-2’ స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించారు. హీరో అల్లు అర్జున్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్కు చేరుకోవడంతో అక్కడ తీవ్ర రద్దీ నెలకొంది. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సినీ, రాజకీయ వర్గాల్లోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన చిక్కడపల్లి పోలీసులు ఇటీవల నాంపల్లి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు, థియేటర్ యాజమాన్యం మరియు సిబ్బందిని ఏ1 నుంచి ఏ10 నిందితులుగా చేర్చారు.
అల్లు అర్జున్ను 11వ నిందితుడిగా పేర్కొనడం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ముందస్తు అనుమతులు, తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, పోలీసుల సూచనలను సక్రమంగా అమలు చేయకపోవడం, సమన్వయ లోపాలు చోటుచేసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు తమ చార్జ్షీట్లో పేర్కొన్నారు.అయితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని నాంపల్లి కోర్టు తిరస్కరించింది. విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో గతంలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయగా, అనంతరం తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి వైద్య సహాయం, ఆర్థిక సాయం అందించారు..