అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏ.ఆర్.మోహన్ దర్శకుడు. రాజేష్ దండా నిర్మాత. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను ఈ నెల 11న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో హీరో నరేష్ అడవిలో గిరిజనులతో కలిసి నడుస్తూ కనిపిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గిరిజనుల సమస్యల్ని చర్చించే చిత్రమిది. మారుమూల ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ గిరిజనుల పక్షాన పోరాడే ప్రభుత్వ అధికారిగా నరేష్ పాత్ర శక్తివంతంగా సాగుతుంది. వ్యవస్థలోని లోపాల్ని, గిరిజనుల కష్టాల్ని చర్చిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అని చెప్పారు. ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సంభాషణలు: అబ్బూరి రవి, నిర్మాణ సంస్థలు: హాస్య మూవీస్, జీ స్టూడియోస్, రచన-దర్శకత్వం: ఎ.ఆర్.మోహన్.