అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన ‘నాంది’ చిత్రం వ్యవస్థలోని లోపాల్ని ఎత్తుచూపుతూ చక్కటి మానవీయ సందేశంతో ఆకట్టుకుంది. ఈ చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. తాజాగా ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నది. ఈ విషయాన్ని సోమవారం ప్రకటించారు. షైన్స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. రక్తపు మరకలతో కనిస్తున్న సంకెళ్లు వేసిన చేతులు, వాటి తాలూకు నీడ గోడపై స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షి రూపంలో కనిపించడం ఉత్సుకతను పెంచుతున్నది.
పోస్టర్ను బట్టి ఈ సినిమాలో కూడా బలమైన సమస్యను చర్చించబోతున్నారని అర్థమవుతున్నది. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇదని, వినూత్నమైన కథతో తెరకెక్కించబోతున్నామని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాతే విజయ్ కనకమేడల దర్శకత్వం వహించే సినిమా సెట్స్ మీదకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.