అల్లరి నరేష్ కథానాయకుడిగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందించిన ‘నాంది’ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న ‘ఉగ్రం’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభోత్సవం జరుపుకుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత దిల్రాజు క్లాప్నివ్వగా, దామోదరప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. నరేష్ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. పవర్ఫుల్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని అన్నారు. ఈ చిత్రానికి కథ: తూము వెంకట్, కెమెరా: సిద్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సంభాషణలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, రచన-దర్శకత్వం: విజయ్ కనకమేడల.