Adipurush | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఆదిపురుష్ (Adipurush) . ఓం రౌత్ డైరెక్షన్లో మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పురాణేతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కింది. అయితే ఆదిపురుష్లో చూపించిన పాత్రలు ఒరిజినల్ రామాయణంలోని పాత్రలను కించపరిచేలా ఉన్నాయని, సినిమాపై నిషేధం విధించాలని అలహాబాద్ హైకోర్టు లో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
ఆదిపురుష్ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని వస్తున్న ఆరోపణలపై, ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేసిన డైలాగ్లపై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) సినిమా నిర్మాతలను ప్రశ్నించింది. ఈ కేసులో సహ-రచయిత మనోజ్ ముంతాషీర్ శుక్లాను భాగస్వామిగా చేయాలని ఆదేశించిన కోర్టు.. ఈ మేరకు మనోజ్ ముంతాషీర్కు నోటీసులు జారీ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
సెన్సార్ బోర్డ్ తన బాధ్యతను నెరవేర్చిందా..?
రామాయణం మనకు ఆదర్శం. ప్రజలు ఇంటి నుండి బయలుదేరే ముందు రామచరితమానస్ని చదువుతారు. సినిమాలోని సంభాషణల తీరు పెద్ద సమస్య. సినిమాలు కొన్ని విషయాలను టచ్ చేయకూడదని కోర్టు పేర్కొంది. హిందూ మతానికి చెందిన ప్రజలు చాలా సహనంతో ఉంటారు.. దీనిని కూడా పరీక్షిస్తారా? అంటూ ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.సెన్సార్ బోర్డ్ అని పిలవబడే ఫిల్మ్ సర్టిఫికేషన్ అథారిటీ తన బాధ్యతను నెరవేర్చిందా.. అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది.
సినిమా చూసి ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండటం విశేషం. ఏమీ కాదన్నట్లుగా సినిమాలో హనుమంతుడిని, సీతను చూపించారు. ఈ అంశాలను మొదటినుంచీ తొలగించాల్సింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు (అడల్ట్)గా అనిపించాయి. ఇలాంటి సినిమాలను చూడటం చాలా కష్టం. ఇది చాలా తీవ్రంగా పరిగణించే విషయం. సెన్సార్ బోర్డు దీనిపై ఏమి చేసిందని కోర్టు ప్రశ్నించింది.
సినిమాలో అభ్యంతరకరమైన డైలాగులను తొలగించామని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వివరణపై కోర్టు స్పందిస్తూ.. అదొక్కటే పనికిరాదని.. సీన్లు ఏం చేస్తారనేదానిపై సూచనలు తీసుకోండి. అప్పుడు తాము చేయాలనుకున్నది తప్పకుండా చేస్తాం.. ఒకవేళ సినిమా స్క్రీనింగ్ నిలిచిపోతే.. ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఉపశమనం లభిస్తుంది.. అని కోర్టు పేర్కొంది. ఈ కేసులో రేపు తదుపరి విచారణ కొనసాగనుంది.