సినిమా ఓ సృజనాత్మక వ్యాపారం. ఇక్కడ కళతో పాటు కాసులు కూడా ముఖ్యమే. కొన్నేళ్ల క్రితం వరకు తమ భాషా పరిధుల్లోనే సినిమాలు తీసిన దర్శకనిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు. తమ సినిమాల కంటెంట్కు విస్త్రతమైన రీచ్తో పాటు వాణిజ్యపరంగా కూడా లాభదాయకంగా ఉండటంతో అగ్రహీరోలందరూ పాన్ ఇండియా సినిమాలకే మొగ్గు చూపుతున్నారు. తెలుగు చిత్రసీమలో ‘బాహుబలి’ ‘ఆర్ఆర్ఆర్’ ‘పుష్ప’ వంటి సినిమాలు జాతీయస్థాయిలో సత్తా చాటాయి. అయితే ఇప్పుడు ద్వితీయశ్రేణి హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలకే సై అంటున్నారు. పరిమిత బడ్జెట్లోనే పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారు. భవిష్యత్తులో ఈ ట్రెండ్ మరింత జోరందుకోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నేచురల్ స్టార్గా హీరో నానికి మంచి పేరుంది. వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటూ ప్రయోగాలకు పెద్దపీట వేయడం ఆయన నైజం. ప్రస్తుతం ఆయన ‘దసరా’ చిత్రంతో పాన్ ఇండియ రేంజ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలంగాణ సింగరేణి నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. 80కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారని సమాచారం. ‘ఈ సినిమా ప్రచార కార్యక్రమాల సందర్భంగా దేశమంతా తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తున్నారని అర్థమైంది. నార్త్ ఇండియాలో ఎక్కడకు వెళ్లినా తెలుగు కళాకారుల్ని గుర్తుపడుతున్నారు. ఓటీటీలు, డిజిటల్ మీడియా వల్ల తెలుగు తారలు దేశమంతటా పరిచయమయ్యారు’ అంటూ నాని ఆనందం వ్యక్తం చేశారు.
కథలో ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తున్నా..ఇప్పటివరకు కెరీర్లో ఆశించిన భారీ విజయాన్ని దక్కించుకోలేకపోయారు అక్కినేని హీరో అఖిల్. ఇప్పుడాయన ఆశలన్నీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ఏజెంట్’ సినిమాపైనే ఉన్నాయి. ఇందులో అఖిల్ అంతర్జాతీయ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ విభిన్నమైన మేకోవర్తో సిద్ధమయ్యారు. ప్రచార చిత్రాల్లో ఆయన లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ‘ ైస్టెలిష్ స్పై థ్రిల్లర్ ఇది. కథ, మేకింగ్ పరంగా పాన్ ఇండియా రేంజ్కు తీసుకెళ్తేనే బాగుంటుందని భావించాం. అఖిల్కు ఈ చిత్రం సరికొత్త ఇమేజ్ను తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’ అని చిత్రబృందం చెబుతున్నది. ఏప్రిల్ 28న ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదలకానుంది.
గత ఏడాది ‘ది వారియర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు రామ్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలో బోల్తాకొట్టింది. దాంతో ఈ ఏడాది ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే. హీరోల్ని అత్యంత శక్తివంతంగా తెరపై ఆవిష్కరిస్తారనే పేరున్న దర్శకుడు బోయపాటి..ఈ సినిమాలో రామ్ను మునుపెన్నడూ చూడని రీతిలో చూపించబోతున్నారట. పోరాట ఘట్టాలు హైలైట్గా నిలుస్తాయని చెబుతున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. జూలైలో ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నారు. బోయపాటి శ్రీను, రామ్ కెరీర్లో ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు యువ హీరో సాయిధరమ్తేజ్. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆయన సినిమాల వేగాన్ని పెంచారు. ఆయన నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ప్రశ్న ఎక్కడ మొదలైందో సమాధానం అక్కడే వెతకాలి’ అంటూ విడుదల చేసిన టీజర్ కథ ఏమిటనే ఉత్కంతను కలిగిస్తున్నది. 1990లో జరిగిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ప్లేను అందిండంతో పాటు తన స్వీయ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ను ప్రొడక్షన్స్లో భాగం చేశారు. బి.వి. ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
‘ఆః’ ‘జాంబీరెడ్డి’ వంటి చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్వర్మ. సూపర్హీరో కథాంశంతో ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘హను-మాన్’. తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్నారు. భారతీయ పౌరాణిక సూపర్హీరోగా అభివర్ణించే హనుమంతుడి ఇతివృత్తంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘బ్యాట్మాన్, సూపర్మాన్ కంటే మన హనుమాన్ చాలా పవర్ఫుల్. ఈ సినిమాలో వాయుపుత్రుడి శక్తిసామార్థ్యాల్ని గ్రాఫిక్ హంగులతో కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నాం. ఈ సినిమా కోసం అంజనాద్రి అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. హనుమాన్ పాన్ వరల్డ్ సినిమా ఇది’ అని దర్శకుడు ప్రశాంత్వర్మ ఈ సినిమా గురించి చెప్పారు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ చిత్ర టీజర్కు మంచి స్పందన లభించింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.
కార్తికేయ-2 చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నిఖిల్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’. గ్యారీ బిహెచ్ దర్శకుడు. ఇందులో నిఖిల్ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ద్వితీయ శ్రేణి హీరోలు కూడా పాన్ ఇండియా వైపు అడుగులు వేయడం వల్ల కంటెంట్ పరమైన నాణ్యత పెరగడంతో పాటు వాణిజ్య పరంగా కూడా నిర్మాతలకు శ్రేయస్కరంగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీ, డిజిటల్, టీవీ మీడియా ద్వారా తెలుగు హీరోలు అన్ని భాషల ప్రేక్షకులకు చేరువవుతున్నారని, కేవలం అగ్రహీరోలే కాకుండా ద్వితీయ శ్రేణి కథానాయకులు కూడా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటే అవకాశాలు పెరిగాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.