Alia Bhatt | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తాజాగా అంతర్జాతీయ వేదికైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న పురుషాధిక్యత (Male Dominance) గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. కాన్స్ వేదికపై మాట్లాడిన ఆలియా భట్.. భారతీయ సినిమాల్లో చాలా కథలు ఇప్పటికీ హీరోల చుట్టూనే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. దాదాపు 75 శాతం సినిమాల్లో కథ కంటే హీరోకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “సినిమాలో హీరో ఉన్నాడా లేదా అనే దానికంటే, కథ బలంగా ఉందా అనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి” అంటూ ఆమె అభిప్రాయపడ్డారు.
ఆలియా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె ధైర్యంగా నిజం మాట్లాడిందని ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ను పొగిడే క్రమంలో భారతీయ సినిమాను తక్కువ చేసి మాట్లాడారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అలాగే, ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు. ఆమె భర్త రణబీర్ కపూర్ నటించిన యానిమల్ వంటి సినిమాలు తీవ్ర పురుషాధిక్యతతో నిండిపోయి ఉన్నాయని, అలాంటి చిత్రాలపై ఆలియా ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో మార్పు కావాలని చెబుతున్నవారు ముందుగా తమ ఇంటి నుంచే ప్రారంభించాలి అంటూ కొందరు కౌంటర్లు ఇస్తున్నారు.
అయితే మరోవైపు, ఆలియా చెప్పిన విషయాల్లో వాస్తవం ఉందని పలువురు సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. హీరోల పారితోషికాలు, ప్రాధాన్యత, ప్రమోషన్లు అన్నీ కూడా ఇప్పటికీ హీరోలకే అనుకూలంగా ఉంటున్నాయని, హీరోయిన్లకు సరైన గుర్తింపు దక్కడం లేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కృతి సనన్, కంగనా రనౌత్, తాప్సీ వంటి నటీమణులు ఇండస్ట్రీలో ఉన్న వివక్షపై బహిరంగంగా మాట్లాడారు. హీరోలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ, హీరోయిన్లను ద్వితీయ స్థానంలో ఉంచుతున్నారంటూ పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడీ నేపథ్యంలో మరోసారి ఇండియన్ సినిమాలో మార్పు ఎప్పుడు వస్తుంది? కథలే అసలు హీరోలుగా నిలిచే రోజులు ఎప్పుడు వస్తాయి? అనే ప్రశ్న సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.