Deepfake Videos | డీప్ఫేక్ వీడియోస్ (Deepfake Videos).. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అందుకు కారణం హీరోయిన్ల ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే. దేశంలోని టాప్ హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు డీప్ఫేక్ బారిన పడుతున్నారు. ఇప్పటికే నేషనల్ క్రష్గా పేరుపొందిన దక్షిణాది తార రష్మిక మందన్నా (Rashmika Mandanna), బాలీవుడ్ స్టార్ నటులు కత్రినా కైఫ్, కాజోల్కు సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా మరో స్టార్ నటి డీప్ఫేక్ బారిన పడ్డారు.‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ భామ అలియా భట్ (Alia Bhatt)కు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో అలియాను బోల్డ్గా చూపించే ప్రయత్నం చేశారు.
దేశవ్యాప్తంగా డీప్ఫేక్ వీడియోలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సినీతారలు ఒకరి తర్వాత ఒకరు వీటి బారిన పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సినీఇండస్ట్రీని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఇలా వీడియోలు మార్ఫింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు డీప్ఫేక్ కట్టడికి కేంద్రం కూడా నడుం బిగించింది. డీప్ఫేక్ వీడియోలను సృష్టించేవారికి, అలాంటి వీడియోలను వ్యాప్తి చేసే సోషల్ మీడియా సంస్థలకు భారీ జరిమానాలు విధిస్తామని కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవలే వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి నూతన నిబంధనావళిని రూపొందించి త్వరలో అమల్లోకి తెస్తామని కూడా ప్రకటించారు. డీప్ఫేక్(Deepfakes) వీడియోలపై సీరియస్గా ఉన్న కేంద్రం.. ఆ అంశాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
రష్మిక, కత్రినా, కాజోల్.. డీప్ఫేక్ బాధితులే
రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్ఫేక్ వీడియో (deepfake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు, సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత బాలీవుడ్ నటులు కత్రినాకైఫ్, కాజోల్ కూడా డీప్ఫేక్ బారిన పడ్డారు. మరోవైపు డీప్ఫేక్ వీడియోలపై కేంద్ర ఐటీ శాఖ తీవ్రంగా స్పందించింది.
మార్ఫింగ్ చేస్తే మూడేండ్ల జైలు శిక్ష..
సోషల్ మీడియా కంపెనీలకు కేంద్రం ఓ అడ్వయిజరీని కూడా జారీ చేసింది. కృత్రిమ మేధ (ఏఐ)తో కంటెంట్ను తయారుచేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న వాటిపై 24 గంటల్లోగా చర్యలు చేపట్టాలని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్..తదితర సోషల్ మీడియా సంస్థలకు సూచించింది. ఐటీ చట్టం-2000 సెక్షన్ 66-డీ కింద చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అవకాశముందని తెలిపింది. కంప్యూటర్ సాంకేతికతను ఉపయోగించి వ్యక్తుల్ని మోసగిస్తే ఈ సెక్షన్ కింద రూ.లక్ష వరకు జరిమానా, మూడేండ్ల జైలు శిక్ష విధించే అవకాశముందని అడ్వైయిజరీలో కేంద్రం గుర్తు చేసింది. ఐటీ నిబంధనావళిలో రూల్ 3(2) (బీ)ను ఉపయోగించి తప్పుడు వీడియోలను, కంటెంట్ను తొలగించవచ్చునని తెలిపింది. ఫిర్యా దు అందిన 24 గంటల్లోగా మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలపై చర్యలు చేపట్టాలని పేర్కొన్నది.
డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిపై మోదీ ఆందోళన..
డీప్ఫేక్ వీడియోల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని సృష్టించడానికి కృత్రిమ మేధ (artificial intelligence) ను ఉపయోగించడం సమస్యాత్మకమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు. ‘డీప్ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెను ముప్పుగా మారుతున్నాయి. ఇవి సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయి. ఇటీవలే నేను గార్బా పాట పాడినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. అది నా దృష్టికి కూడా వచ్చింది. అదే కాదు అలాంటి వీడియోలు అనేకం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ డీప్ఫేక్ వీడియోలపై ప్రజలకు మీడియా వాళ్లు అవగాహన కల్పించాలి. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అయినప్పుడు వాటిని ఫ్లాగ్ చేసి, వార్నింగ్ ఇవ్వాలని ఛాట్జీపీటీ బృందాన్ని కోరుతున్నా’ అని అన్నారు.
Also Read..
Pneumonia | చైనాలో న్యుమోనియా.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
Lightning Strikes | అకాల వర్షంతో గుజరాత్ అతలాకుతలం.. పిడుగుపాటుకు 20 మంది మృతి