బాలీవుడ్ ప్రేమజంట రణభీర్కపూర్, అలియాభట్ వివాహానికి సిద్ధమవుతున్నారని తెలుస్తున్నది. పెళ్లి వేదిక కోసం దేశంలోని పలు చారిత్రక ప్రదేశాల్ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఇటీవలే వీరిద్దరు కలిసి ప్రైవేట్ విమానంలో రాజస్థాన్లోని జోధ్పూర్ను సందర్శించారు. అక్కడి వివిధ లొకేషన్ల గురించి ఆరా తీశారు. అయితే మీడియా వారితో సంభాషించడానికి మాత్రం ఇష్టపడలేదు. వారి సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రేమికుల జోడీ రాబోవు రెండు మాసాల్లో పెళ్లిపీటలెక్కబోతున్నారని, వివాహ ఏర్పాట్ల కోసమే ప్రత్యేక విమానాల్లో షికార్లు చేస్తున్నారని అంటున్నారు. రణభీర్ సన్నిహితులు మాత్రం తన జన్మదిన వేడుకల కోసమే ఆయన జోధ్పూర్ విచ్చేశారని చెబుతున్నారు. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ఏడాది తమ వివాహం ఖాయమని రణభీర్కపూర్ తెలిపారు. అందుకు తగినట్లుగానే ఈ జంట ప్రయత్నాల్ని ముమ్మరం చేశారని తెలిసింది. కత్రినాకైఫ్తో బ్రేకప్ అనంతరం రణభీర్కపూర్..అలియాభట్తో ప్రేమాయణం నడుపుతున్నారు. ప్రస్తుతం ఈ జంట కలిసి నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తెలుగులో అలియాభట్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.