ముంబై: బాలీవుడ్ నటులు రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) ఒకటి కాబోతున్నారు. వారిద్దరు గురువారం మధ్యాహ్నం జంట కానున్నారు. ఇప్పటికే ముంబైలోని పాలీ హిల్స్లో ఉన్న వాస్తూ రెసిడెన్సీలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు గణేశ్ పూజ జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు మెహిందీ సెర్మనీ జరుగనుంది. చాలా గోప్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. కేవలం ఫ్యామిలీ సభ్యులు, రణ్బీర్, ఆలియాతో సన్నిహితంగా ఉండే మిత్రులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తు బిల్డింగ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయితే ఈ వేడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మీడియాకు రిలీజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వేడుకల్లో పాల్గొనే సిబ్బంది ఫోన్లకు రెండు వైపులా ఎరుపు రంగులో ఉన్న స్టిక్కర్లు అంటిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.