బాలీవుడ్కే కాదు దేశీయ సినిమా రంగం మొత్తానికీ ఇది కష్టకాలమే అంటున్నది హిందీ తార ఆలియా భట్. హిందీలోనే కాదు ప్రాంతీయ చిత్రాలూ సరైన ఆదరణ పొందడం లేదన్నది ఆమె అభిప్రాయం. పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించిన కొన్ని చిత్రాలనే మనం లెక్కిస్తున్నాం గానీ…ఆదరణ పొందని సినిమాలూ ప్రతి భాషలోనూ ఎక్కువ సంఖ్యలోనే వస్తున్నాయని ఆలియా అంటున్నది. ఆమె మాట్లాడుతూ…‘పాండమిక్లో రెండేళ్ల పాటు థియేటర్స్ మూసివేశారు. అందుకే ఇప్పుడు విడుదలవుతున్న సినిమాలపై అందరి దృష్టీ పడుతున్నది. సినిమా ఎలా ఉందనే చర్చ గతంలో కంటే ఎక్కువైంది. ఇది బాలీవుడ్కే కాదు మొత్తం ఇండియన్ సినిమాకే గడ్డుకాలం. ఇప్పుడు మనం ఓటీటీకి ఏ తరహా చిత్రాన్ని ఇవ్వాలి, థియేటర్కు ఏ కంటెంట్ చేయాలి అనే విభజన చేసుకోవాలి. అసలు ప్రేక్షకులు ఏది ఇష్టపడుతున్నారో తెలుసుకునే కసరత్తు చేయాలి. నేను నటించిన ‘గంగూభాయ్ కథియావాడి’ సహా మరికొన్ని చిత్రాలు ఇక్కడ మంచి విజయాన్ని సాధించాయి. వాటి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. సినీ పరిశ్రమ మీద జాలి చూపించండి. అపజయం పాలైన సినిమాలు దక్షిణాదిలోనూ బోలెడన్ని ఉన్నాయి’ అని చెప్పింది.