OTT | ఇంటింటికీ పరిచయమైన ఓటీటీ.. సినీ ఇండస్ట్రీకి కొత్త సవాలు విసురుతున్నది. ఎంత గొప్ప సినిమా అయినా.. నెల రోజుల్లో ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నది. దీంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం దర్శక, నిర్మాతలకు కత్తి మీద సాములా తయారైంది. ఈ సినిమా థియేటర్లో చూస్తేనే కిక్కు వస్తుంది అనుకునేలా చిత్రాలను నిర్మిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ‘సింగమ్ అగైన్’ సినిమాలో ఒకే యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.25 కోట్లు వెచ్చించారట నిర్మాతలు. అజయ్ దేవ్గణ్, అక్షయ్ కుమార్, రణ్వీర్సింగ్, టైగర్ ష్రాఫ్, విక్కీ కౌశల్, దీపికా పదుకొణె ఇలా భారీ తారాగణం ఇందులో నటిస్తున్నది.
ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్లు దాటేలా ఉందని ఇండస్ట్రీ టాక్! ప్రతి సన్నివేశాన్నీ ప్రేక్షకులు మెచ్చేలా చిత్రిక పట్టాలన్న లక్ష్యంతో రాజీ పడకుండా ఖర్చు చేస్తున్నారట. అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సునీల్ శెట్టి తదితరులు నటిస్తున్న సినిమా ‘వెల్కం టు జంగిల్’. ఈ సినిమా నిర్మాణ వ్యయం నటీనటుల రెమ్యునరేషన్ కాకుండా రూ.100 కోట్లు దాటుతున్నదట. దాదాపు పాతికేళ్ల తర్వాత నిర్మాత కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ జోడీ కడుతున్న చిత్రం ‘బుల్’. ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్ దీనికి దర్శకుడు. ఇందులో సల్మాన్ ఆర్మీ బ్రిగేడియర్గా నటిస్తున్నారు. యుద్ధ సన్నివేశాలను ఆసక్తికరంగా తీర్చిదిద్దడానికి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారట. రూ.150 కోట్ల బడ్జెట్తో దీన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా ఓటీటీకి ఓటేస్తున్న ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఆరాటపడుతున్న సినీజనం.. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కావొద్దని ఫిక్సయినట్టున్నారు!