Naa Saami Ranga | కింగ్ నాగార్జునకు సంక్రాంతి బాగా కలిసొచ్చే సీజన్. ఈ సీజన్ లో ఆయనకు మంచి ట్రాక్ రికార్డ్ వుంది. ఈసారి పండక్కి కూడా ఆయన నుంచి ‘నా సామిరంగ’ వచ్చింది. ఈ సినిమా ప్రచార చిత్రాల్లో పండగ కళ ఉట్టిపడింది. ‘ఈసారి సంక్రాంతికి బాక్సాఫీసు కొడుతున్నాం’ అని స్వయంగా నాగార్జున చెప్పడం ఇంకా ఆసక్తిని పెంచింది. మరి ఆయన చెప్పినట్లు నా సామిరంగ పండక్కి బాక్సాఫీసు వద్ద సందడి చేసే చిత్రమేనా ? నాగార్జునకు మరోసారి సంక్రాంతి హిట్ సెంటిమెంట్ కలిసొచ్చిందా ?
కథ గురించి: 1960-80మధ్య కాలంలో గోదావరి, అంబాజీపేట నేపధ్యంలో సాగే కథ ఇది. కిష్టయ్య( నాగార్జున) అంజి (అల్లరి నరేష్) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లానే వుంటారు. ఆ ఊర్లో వడ్డి వ్యాపారం చేసే వరదరాజులు( రావు రమేష్) కూతురు వరాలు( అషికా రంగనాథన్) కిష్టయ్య ప్రేమించుకుంటారు. అయితే అనుకోని ఓ ఘటన వాళ్ళ పెళ్ళికి అడ్డంకిగా మారుతుంది. మరి ఈ ఇద్దరి పెళ్లి జరిగిందా ? వీళ్ళ పెళ్లికి వున్న అడ్డంకి ఏమిటి? ఈ కథలో పెద్దయ్య( నాజర్) భాస్కర్ (తరుణ్ భాస్కర్) మంగ( మిర్నా మీనన్) కుమారి( రుక్సర్) పాత్రల ప్రాధాన్యత ఏమిటి ? కిష్టయ్య, అంజి పాత్రల ప్రయాణం ఏ తీరాలకు చేరింది? కిష్టయ్య ప్రేమకథకు మిగింపు దొరికిందా ? ఇవన్నీ తెరపై చూడాలి.
కథా విశ్లేషణ: స్నేహం, ప్రేమ, విశ్వాసం, పగ, ప్రతీకారం లాంటి భావోద్వేగాలతో అల్లుకున్న కథ ఇది. ‘ పోరింజు మరియం జోష్’ అనే మలయాళం సినిమా నుంచి కథని తీసుకున్నారు. ఈ సినిమాని పండక్కే ఎందుకు విడుదల చేయాలని చిత్ర బృందం భావించిందో సినిమా చూస్తే అర్ధమైపోతుంది. పండగకళ, తెలుగుదనం ఉట్టిపడేలా సినిమాని ప్రజంట్ చేయడంలో చాలా చక్కని పనితీరు కనబరిచాడు కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ. కిష్టయ్య, అంజి పాత్రల మధ్య స్నేహాన్ని పరిచయం చేస్తూ ఆహ్లాదకరంగా హార్ట్ టచ్చింగా ఈ కథ మొదలౌతుంది. ఒకవైపు కిష్టయ్య, అంజి స్నేహం.. మరోవైపు కిష్టయ్య, వరాలు ప్రేమకథ.. ఇంకో వైపు భాస్కర్, కుమారిలా ప్రేమకథ..ఈ మూడు లేయర్స్ ని ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ పాత్రల మధ్య కెమిస్ట్రీ చాలా బావుంది.
విరామానికి ముందు దాసు (షబీర్ కళ్లారక్క) పాత్ర రూపంలో ఈ కథలో అసలైన సంఘర్షణని తెరపైకి వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచుతుంది. అప్పటి వరకూ పండగకళతో ఆహ్లాదకరంగా సాగుతున్న కథ దాసు పాత్ర రాకతో కాస్త హింసాత్మకంగా మారుతుంది. అయితే ఈ పాత్ర కథతో అసలైన ఎమోషన్ ఎలివేట్ చేయడానికి బాటలు వేస్తాడు దర్శకుడు. ప్రీక్లైమాక్స్ లో వచ్చే ప్రభల తీర్ధం యాక్షన్ ని పంచితే.. క్లైమాక్స్ లో అంజి పాత్రలో వచ్చే ఎమోషనల్ కోణం ప్రేక్షకుల మనుసుని బరువెక్కిస్తుంది. ఈ కథకు ఇచ్చిన ముగింపు కూడా ఆకట్టుకునేలా వుంటాయి.
నటీనటుల నటన: కిష్టయ్య పాత్రలో నాగార్జున ఒదిగిపోయారు. పల్లెటూరి పాత్రలు చేయడంలో తన ప్రత్యేకతని మరోసారి చాటారు. నాగార్జున లుక్, స్టయిల్, డైలాగ్ చెపే విధానం, ప్రజెన్స్ .. ఇలా ప్రతిది ఆకర్షించేలా వుంది. యాక్షన్ సీన్స్ లో తన యీజ్ చూపించారు. ఇంటర్వెల్ లో సైకిల్ చైన్ లాగే సీక్వెన్స్ ఫ్యాన్స్ కి పండగే. అంజి పాత్రలో అల్లరి నరేష్ ఆకట్టుకున్నారు. చాలా సహజమైన నటన కనబరిచారు. నాగార్జున, అల్లరి నరేష్ మధ్య బాండింగ్ చక్కగా కుదిరింది. రాజ్ తరుణ్ పాత్ర కూడా కథలో కీలకంగానే నిలిచింది. ప్రభల తీర్ధం ఎపిసోడ్ ఆ పాత్ర నుంచే తెరపైకి వస్తుంది. అషికా రంగనాథ్ అందంగా కనిపించింది. నటనకు ఆస్కారం వుండే పాత్రలో తన వంతు న్యాయం చేసింది. మిర్నా, రుక్సర్, నాజర్ పాత్రలతో పాటు మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి
టెక్నికల్:
కీరవాణి మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పాటలు బావున్నాయి, చూడటానికి కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. కెమరాపనితనం బావుంది. ఎడిటింగ్ లో చురుకుదనం కనిపించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. తక్కువ సమయంలోనే చాలా క్యాలిటీగా సినిమా తీయడం విశేషం. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీకి మంచి మార్కులు పడతాయి. కథని తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా మార్చడంలో రచయితలు మంచి పనితీరు కనపరిచారు.
ప్లస్ పాయింట్స్
కథ, కథనం
నాగార్జున నటన
మంచి తారాగణం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ కాస్త సాగదీత
కోనసీమకు నప్పని సైకో విలనిజం
*రేటింగ్ : 3/5