బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందించిన ‘అఖండ’ చిత్రం గత ఏడాది బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ధార్మిక, వాణిజ్య అంశాలు కలబోసిన కథాంశంతో ప్రేక్షకుల అభిమానం చూరగొంది. ఈ సినిమా సీక్వెల్ గురించి గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై స్పం దించారు బాలకృష్ణ. ప్ర స్తుతం ఆయన గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. ‘అఖండ’ చిత్రాన్ని ఈ వేడుకలో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ ‘అఖండ-2’ తప్పకుండా ఉంటుందని, కథ కూడా సిద్ధమైందని తెలిపారు. సరైన సమయంలో ఈ సినిమా గురించి ప్రకటన చేస్తామన్నారు. తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై స్పందిస్తూ.. వచ్చే ఏడాది మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తామన్నారు. బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.