‘ఇందులో నా పాత్ర పేరు ‘దామిని’. తన ప్రయాణాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆస్వాదిస్తారు. తిరువీర్ కార్పొరేటర్ కావాలని కలలుకనే యువకుడిగా కనిపిస్తాడు. వాళ్ల నాన్న.. తన కొడుకులిద్దరిలో ఎవరికి ముందు కొడుకు పుడితే వాడికే ఆస్తి రాస్తానంటాడు. అలాంటి సమయంలో తిరువీర్ జీవితంలోకి నేను ఎంట్రీ ఇస్తాను. నేనేమో ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయిని. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం’ అంటూ చెప్పుకొచ్చింది అగ్ర కథానాయిక ఐశ్వర్య రాజేశ్. ఆమె, తిరువీర్ జంటగా నటించిన రూరల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకుడు. మహేశ్వర్రెడ్డి మూలి నిర్మాత. శుక్రవారం(నేడు) సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో కథానాయిక ఐశ్వర్యరాజేష్ విలేకరులతో మాట్లాడింది. ‘దర్శకుడు భరత్ దర్శన్ ఈ కథ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. నేను ఇప్పటివరకూ పనిచేసింది ఎక్కువ శాతం కొత్తవారితోనే. భరత్ కూడా కచ్చితంగా సక్సెస్ అవుతాడు. తిరువీర్ ఇందులో సహజంగా నటించారు. నిర్మాత మహేశ్వరరెడ్డి అభిరుచి గల నిర్మాత. ఇది ఒక క్యూట్ విలేజ్ స్టోరీ. చక్కటి వినోదం ఉంటుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని నమ్మకం వెలిబుచ్చింది ఐశ్వర్య రాజేష్.