‘కథానాయికగా మాత్రమే నటించాలనే నియమాలు నాకు లేవు. పాత్ర నిడివి గురించి నేనెప్పుడూ పట్టించుకోను. క్యారెక్టర్ చిన్నదైనా చాలా కాలం పాటు గుర్తుండిపోవాలని కోరుకుంటా’ అని చెప్పింది ఐశ్వర్యరాజేష్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్’. సాయితేజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకుడు. అక్టోబర్ 1న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్లో ఐశ్వర్యరాజేష్ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి..
రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నించే ఐఏఎస్ అధికారి కథ ఇది. వాణిజ్య అంశాలకు సామాజిక ఇతివృత్తాన్ని మేళవిస్తూ దర్శకుడు దేవా కట్టా ఈ సినిమాను తెరకెక్కించారు. హీరోహీరోయిన్లు అనే విభజన ఆయనకు నచ్చదు. ప్రతి పాత్రకు సమ ప్రాధాన్యతనిస్తూ సినిమాను రూపొందించారు. కథ నచ్చడంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్ర కావడంతో ఈ సినిమాను అంగీకరించాను. మైరా అనే ఎన్ఆర్ఐ అమ్మాయిగా ఇందులో కనిపిస్తా. తనకు ఎదురైన ఓ సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ మాతృదేశానికి వచ్చిన ఆమెకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే డ్యూయెట్స్, లవ్సీన్స్ ఈ సినిమాలో కనిపించవు. పరిణతితో ప్రేమకథను తెరకెక్కించారు.
వాస్తవికతకు పెద్దపీట
సినిమాల ప్రభావం ప్రేక్షకులపై ఉంటుందని నమ్ముతా. మంచి చెబితే తప్పకుండా స్వీకరిస్తారు. తెలుగులో కమర్షియాలిటీ కన్నా వాస్తవికతను ప్రాముఖ్యతనిచ్చే ధోరణి పెరిగింది. గ్లామర్ కంటే అభినయంతోనే కథానాయికలు మంచి పేరుతెచ్చుకుంటున్నారు. తెలుగులో అలాంటి పాత్రల కోసం నేను ఎదురుచూస్తున్నా. గ్లామర్ పాత్రలను నేను చేయలేను. ‘భీమ్లానాయక్’ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చిత్రబృందం నన్ను సంప్రదించింది. కానీ ఆ సినిమాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తెలుగులో రాజశేఖర్తో ఓ సినిమా చేయబోతున్నా. తమిళంలో కొన్ని సినిమాలు చేస్తున్నా.