అభిరామ్, గీతికా తివారి జంటగా నటిస్తున్న సినిమా ‘అహింస’. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 2న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ…‘అహింసను నమ్మే యువకుడి కథ ఇది. అతనికి తప్పనిసరి పరిస్థితులు ఎదురైనప్పుడు కృష్ణ తత్వాన్ని పాటించి ఎలా బయటపడ్డాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలో కొత్త అంశాలుంటాయి. లొకేషన్స్ అన్నీ సహజంగా ఉండి ఆకట్టుకుంటాయి. కథ బాగుంటే సంగీతం కూడా బాగానే కుదురుతుంది. ఈ సినిమా పాటలకు మంచి స్పందన వస్తున్నది. ఇంకా పేరు రావాలి. అయితే కొన్ని చిత్రాలు విడుదలయ్యాక పాటలకు ఆదరణ పెరుగుతుంది. తేజ లాంటి దర్శకుడి సినిమాతో అభిరామ్ అరంగేట్రం చేయడం అతని కెరీర్కు కలిసొస్తుంది. కొత్త వాళ్లతో ఎలా సినిమా చేయించుకోవాలో తేజకు బాగా తెలుసు. ఇటీవల సంగీతం ట్రెండ్ మారింది. అయితే నేను సినిమాకు ఏం కావాలో అదే చేస్తాను గానీ ట్రెండ్ను అనుసరించను. నేను సంగీతం నేర్చుకోలేదు. గత జన్మలో సంగీత దర్శకుడిని అయి ఉంటా. అదే నాతో ఈ పాటలన్నీ చేయిస్తున్నది. సంగీత దర్శకుడు కావాలనేది నా కోరిక. అయితే దర్శకత్వం, నటన వైపు తప్పనిసరి పరిస్థితుల్లో అడుగువేయాల్సి వచ్చింది. ఇప్పటికీ రోజూ కొత్త కథలు రాస్తుంటా. మంచి నిర్మాత దొరికితే వాటిని తెరకెక్కిస్తా. నేను రాసిన కథల్లో ఎన్నికల ప్రక్రియ మీద ఒక కథ ఉంది. ఆ కథతో సినిమా చేస్తే ఎలక్షన్ విధానమే మారిపోతుందని నా అభిప్రాయం.’ అన్నారు.