తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘శభాష్ మిథూ’. భారత మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ రూపొందించారు. ఈ నెల 15న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో నాయిక తాప్సీ, మిథాలీ రాజ్ పాల్గొన్నారు. తాప్సీ మాట్లాడుతూ…‘నా కెరీర్లో బాగా శ్రమించి చేసిన సినిమా ఇది. చిన్నప్పటి నుంచి ఫుట్ బాల్, వాలీబాల్ ఆడినా, క్రికెట్ ఎప్పుడూ ఆడలేదు. దాంతో ఈ సినిమా కోసం శిక్షణ తీసుకోవాల్సి వచ్చింది.
ఒక దిగ్గజ క్రికెటర్ పాత్రలో మెప్పించాలంటే వీలైనంత సహజంగా కనిపించాలి. అదొక సవాలులా తీసుకుని నటించా. మహిళా క్రికెట్కు గుర్తింపు తీసుకొచ్చేందుకు మిథాలీ పడిన శ్రమ ఇప్పుడు ప్రజలకు తెలిసింది. దాంతో ఆ పాత్రలో మెప్పించాలనే ఒత్తిడి నటిగా నాపైనా పడింది. ఆమె ఎలా క్రికెట్ ఆడుతుంది, ఫేవరేట్ షాట్ ఏంటి, ఎలా మాట్లాడుతుంది అనేది సాధన చేశాను. కొన్నిసార్లు మిథాలీ స్వయంగా సలహాలు ఇచ్చేది, మరి కొన్నిసార్లు ఆమె వీడియో ఇంటర్వ్యూస్ చూసి తెలుసుకున్నా’ అని చెప్పింది.
మిథాలీ రాజ్ మాట్లాడుతూ…‘నా జీవిత కథతో సినిమా తెరకెక్కిస్తున్నారంటే ముందు నమ్మలేకపోయాను. బయోపిక్ను సరైన విధంగా రూపొందించేందుకు ఈ టీమ్ మంచి ప్రయత్నం చేశారు. క్రికెట్ అంటే చాలా కాలం పురుషుల ఆటగానే చూశారు. పది మంది అబ్బాయిలు కలిస్తే పురుషుల క్రికెట్ గురించే మాట్లాడుకుంటారు. ఏమాత్రం సౌకర్యాలు లేని స్థాయి నుంచి ఇవాళ మహిళా క్రికెట్ గురించి ప్రపంచం మాట్లాడుకునేలా చేశాం. ఆ భావోద్వేగ ప్రయాణానికి రూపమే ఈ సినిమా. తాప్సీ ఈ చిత్రంలో ఆకట్టుకునేలా నటించింది’ అని చెప్పింది.