Janhvi Kapoor | ప్రస్తుతం వినోదరంగంలో ఓటీటీ ప్లాట్ఫామ్లు ముఖ్య భూమిక పోషిస్తున్నాయని, ఏ వేదికలో సినిమా రిలీజ్ అయినా ప్రేక్షకులకు చేరువకావడమే అంతిమలక్ష్యమని చెప్పింది యువ నాయిక జాన్వీకపూర్. ఈ భామ నటించిన గుంజన్ సక్సేనా, గుడ్లక్ జెర్రీ, మిలీ చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. జాన్వీకపూర్ తాజా చిత్రం ‘బవాల్’ వచ్చేవారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నితీష్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాజిద్ నదియావాలా నిర్మించారు.
వరుణ్ధావన్ కథానాయకుడిగా నటించారు. తన చిత్రాలు వరుసగా ఓటీటీ ప్లాట్ఫామ్స్పై విడుదల కావడం విషయంలో ఏమాత్రం అసంతృప్తి లేదని జాన్వీకపూర్ పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘నా దృష్టిలో థియేటర్, ఓటీటీ..ఏ వేదికైనా ప్రేక్షకులకు సినిమా చేరువకావడమే ముఖ్యం. ప్రస్తుతం ఓటీటీ ద్వారా కొన్ని కోట్ల మంది ప్రేక్షకులకు సినిమా చేరువవుతున్నది. వసూళ్ల లెక్కల గురించి నేను పెద్దగా పట్టించుకోను కాబట్టి ఎక్కడైనా సినిమా రిలీజ్ కావడమే ముఖ్యమని నేను భావిస్తాను’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.