Satluj | ప్రముఖ నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన వివాదాస్పద చిత్రం ‘సత్లుజ్’ డిజిటల్ ప్లాట్ఫామ్ నుండి తొలగించబడిన తర్వాత పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో ఒక కొత్త ఉద్యమంగా మారింది. మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా, హనీ ట్రెహన్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 3న నేరుగా జీ5 ఓటీటీలో విడుదలైంది. అయితే కేంద్ర సెన్సార్ బోర్డుతో చాలా కాలం వివాదాల తర్వాత విడుదలైన ఈ సినిమాను, భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఐటీ నిబంధనల కింద కేవలం 48 గంటల్లోనే ఓటీటీ నుంచి తొలగించింది.
అయితే ప్రభుత్వ నిషేధం ఈ సినిమాపై ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం పంజాబ్ సరిహద్దు గ్రామాలైన ఫజిల్కా వంటి ప్రాంతాల్లో స్థానిక యువత సొంతంగా డబ్బులు పోగుచేసి, ప్రొజెక్టర్ల సాయంతో కమ్యూనిటీ హాళ్లలో ప్రైవేట్ స్క్రీనింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయంగా జీ5 గ్లోబల్ ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమాను ఐక్లౌడ్, పెన్ డ్రైవ్ల ద్వారా డౌన్లోడ్ చేసుకుని ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. ఒక్కో స్క్రీనింగ్కు వందలాది మంది గ్రామస్తులు తరలివస్తున్నారు.
ఈ ప్రదర్శనలు పంజాబ్ పాత గాయాలను, 1984 నుండి 1994 మధ్య కాలంలో జరిగిన అల్లర్లు, పంజాబ్ పోలీసుల కఠిన చర్యల వల్ల అదృశ్యమైన వేలాది మంది సిక్కు యువకుల చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నాయి. పెద్దలు ఈ సినిమా చూస్తూ భావోద్వేగానికి గురవుతుంటే, యువత తమ ప్రాంత చరిత్రను తెలుసుకోవడానికి ఇదొక అవకాశంగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపుతోంది. కాగా శిరోమణి అకాలీదళ్ (SAD) వంటి ప్రతిపక్ష పార్టీలు ఈ నిషేధాన్ని భావప్రకటన స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తూ, ఈ సినిమాను పంజాబ్లోని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తామని ప్రకటించాయి. యాప్స్ నుండి తొలగించినా, నిజం ఆగదంటూ స్థానిక యువత ఈ స్క్రీనింగ్లను మరింత ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.