Shraddha Kapoor | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఈత’ అధికారిక టీజర్ విడుదలైంది. ‘ఛావా’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ బయోపిక్ డ్రామాకు దర్శకత్వం వహిస్తున్నారు.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జానపద, లావణి నృత్య కళాకారిణి విఠాబాయి నారాయణగాంకర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణదీప్ హుడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్లో శ్రద్ధా కపూర్ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. గర్భవతిగా ఉండి కూడా స్టేజ్ పై నృత్యం చేయడం, ప్రసవ వేదన అనుభవిస్తూనే కళ కోసం రంగస్థలంపైకి రావడం వంటి భావోద్వేగ సన్నివేశాలు టీజర్లో హైలైట్గా నిలిచాయి. ‘మంచంపై పడి చనిపోతే నన్ను ఒక నిస్సహాయురాలిగా గుర్తుంచుకుంటారు. అదే నృత్యం చేస్తూ చనిపోతే ఒక చరిత్రగా నిలిచిపోతాను’ అంటూ శ్రద్ధా కపూర్ చెప్పే డైలాగ్ రోమాలు నిక్కబొడుస్తున్నాయి. ఇక ఈ చిత్రం 2026 ఆగస్టు 28న థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.