Adivi Sesh | టాలీవుడ్ హీరో అడివి శేష్ తన వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన నటించిన డెకాయిట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంటోంది. దర్శకుడు షానీల్ డియో తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటించగా, ప్రముఖ నటులు అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్పై ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తాను ఓ సినిమా చేయబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించాడు. ఇటీవల రాహుల్ రవీంద్రన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ది గర్ల్ఫ్రెండ్ చిత్రం మంచి ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన శేష్ కోసం కూడా ఒక బలమైన కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.అయితే ఈ క్రేజీ కాంబినేషన్ వెంటనే పట్టాలెక్కే అవకాశాలు లేవు. ప్రస్తుతం అడివి శేష్ తన సూపర్ హిట్ చిత్రం గూఢచారికి సీక్వెల్గా వస్తున్న G2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పనులు పూర్తయ్యాకే రాహుల్ రవీంద్రన్ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అడివి శేష్ సెలెక్టివ్ కథల ఎంపిక, రాహుల్ రవీంద్రన్ ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ కలవడంతో ఈ కొత్త సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కాంబినేషన్ నుంచి మరో విభిన్నమైన సినిమా రావడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. చూద్దాం ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో అనేది. కాగా, భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన డెకాయిట్ మూవీ ఓ మోస్తరు వసూళ్లు రాబడుతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ లాభాల్లోకి చేరుకుంటుందా లేదా అనే చర్చ జోరుగా నడుస్తుంది.