సుహాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. శివాని నాగరం కథానాయిక. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ పతాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. మంగళవారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దుశ్యంత్ మాట్లాడుతూ ‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతోంది. ఇన్నేళ్లలో ఎన్నో త్యాగాలు చేస్తేనే ఈ స్థాయికి చేరుకున్నా. త్యాగాలకు ఫలితం సినిమా సక్సెస్ ద్వారా దొరుకుతుందని ఆశిస్తున్నా. సుహాస్ లేకుంటే నేను డైరెక్టర్ అయ్యేందుకు ఇంకా ఎన్నేళ్లు పట్టేదో తెలియదు’ అన్నారు. నేను నిర్మాతగా ఎదిగేందుకు అల్లు అరవింద్ గారు, శిరీష్ గారు, బన్నీ వాసు గారు కారణం. ప్రతి విషయంలో మాకు గైడెన్స్ ఇచ్చారు’ అన్నారు చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని. హీరో సుహాస్ మాట్లాడుతూ ‘నేను గీతా ఆర్ట్స్లో హీరోగా చేస్తున్నానంటే మా పేరెంట్స్ నమ్మలేదు. అంతటి అవకాశమిచ్చిన బన్నీ వాసు గారి ప్రోత్సాహం మరువలేనిది. ఫిబ్రవరి 1నే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. మీకిష్టమైన సినిమాల్లో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా’ అన్నారు.