ప్రభాస్ పౌరాణిక నేపథ్య చిత్రం ‘ఆదిపురుష్’ ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 9వ తేదీన త్రీడీ ఫార్మేట్లో ట్రైలర్ను ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబోతున్నారు. అమెరికా, యూకే, జపాన్, సింగపూర్ వంటి దాదాపు 70 దేశాల్లో ట్రైలర్ను విడుదల చేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు కర్నాటక, తమిళనాడులోని పలు థియేటర్లలో ‘ఆదిపురుష్’ ట్రైలర్ సందడి చేయనుంది. ఈ ట్రైలర్ ప్రదర్శించే థియేటర్స్ జాబితాలను తాజాగా చిత్రబృందం ప్రకటించారు. ఇంత భారీ స్థాయిలో త్రీడీ ట్రైలర్ ప్రదర్శించడం తెలుగు తెరపై ఇదే తొలిసారి. భారతీయ ఇతిహాస గాథను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించబోతున్నాం అని చిత్రబృందం తెలిపింది. రామాయణ గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని సకల హంగులతో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నారు. కృతి సనన్ సీతగా కనిపించనుంది. టీ సిరీస్, రెట్రో ఫైల్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ 16న ఈ సినిమా విడుదల కానుంది.