ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాను రామాయణ గాథ నేపథ్యంతో దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భూషణ్ కుమార్ నిర్మాత. యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ నిర్మాణంలో భాగమయ్యారు. ఆదివారం అయోధ్యలో టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. టీజర్లో నా ఆగమనం అధర్మ విధ్వంసం అంటూ శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ చెప్పిన సంభాషణలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో దర్శకుడు ఓం రావత్ మాట్లాడుతూ..‘పవిత్ర అయోధ్య నగరంలో ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల వేడుక జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆదిపురుష్ అనేది కేవలం ఒక సినిమానే కాదు మనందరి భక్తికి ప్రతీక. మా అందరి ఇష్టంతో యజ్ఞంలా భావించి పనిచేశాం’ అన్నారు.
ప్రభాస్ మాట్లాడుతూ…‘మొదట ఈ పాత్రలో నటించేందుకు భయపడ్డాను. ప్రేమ, భయ భక్తులతో ఈ సినిమాను రూపొందించాం. అంకితభావం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఉండటం అనే విషయాలను శ్రీరాముడి నుంచి మనం నేర్చుకోవచ్చు. శతాబ్దాలుగా ఈ లక్షణాలను అనుసరించాలని చూస్తున్నాం కానీ మనిషి వల్ల కావడం లేదు. అందుకే మనం మనుషులం అయ్యాం, శ్రీరాముడు దేవుడు అయ్యారు’ అన్నారు.
హీరోయిన్ కృతి సనన్ మాట్లాడుతూ…‘మన ఇతిహాస ఘనతను ఈ చిత్రంలో చూస్తారు. ఇలాంటి గొప్ప కథలో, పాత్రలో నటించే అవకాశం అందరికీ దకదు. జానకి పాత్రలో నటించడం ఉద్వేగంగా అనిపించింది. ఒక కల తీరిన అనుభూతి కలిగింది’ అని చెప్పింది. రామాయణ నేపథ్యంతో సినిమా నిర్మించాలనే మా నాన్న గారి కల ఈ సినిమాతో తీరింది అని నిర్మాత భూషణ్ కుమార్ అన్నారు.