Adipurush | బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారాడు ప్రభాస్. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రంలో నటిస్తున్నాడు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో చిత్రాన్ని రూపొందిస్తుండగా.. ఇందులో రాముడి పాత్రను పోషిస్తున్నాడు. కృతిసనన్ సీత పాత్రను పోషిస్తుండగా.. సైఫ్ అలీఖాన్తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో రెట్రో ఫైల్, టీ సిరీస్ సంస్థలు చిత్రాన్ని నిర్మిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ సైతం భాగస్వామిగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే టీజర్ విడుదలవగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది.
చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. అయితే చిత్రం విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఇందుకు వీఎఫ్ఎక్స్ కారణంగా తెలుస్తున్నది. సినిమాకు సంబంధించి ఇంకా వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో విడుదలను వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మరో వైపు జనవరిలో సంక్రాంతికి భారీ సినిమాలు విడుదకానున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్ చిత్రం విడుదలను వాయిదా వేయాలని మేకర్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి చిత్రాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ రెండు సినిమాలను నిర్మించడం విశేషం. అలాగే ఆదిపురుష్ చిత్రంలో వీఎఫ్ఎక్స్పై పలు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరో చిత్రాలతో పోటీ పడితే కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండడంతో మేకర్ వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతున్నది. మరి ఈ వార్తలపై మేకర్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.