ఆదర్శ్, చిత్ర శుక్లా జంటగా నటిస్తున్న సినిమా బుధవారం హైదరాబాద్లో ప్రారంభోత్సవం జరుపుకుంది. చేతన్ రాజ్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా…ఆంథోనీ ఎం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చేతన్ మైసూర్య నిర్మాత. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రమేష్ ప్రసాద్ క్లాప్నిచ్చారు. అనంతరం దర్శకుడు ఆంథోనీ ఎం మాట్లాడుతూ…‘గతంలో దర్శకుడు రాజమౌళి చిత్రాలకు ఎడిటింగ్ విభాగంలో పనిచేశాను. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాను. క్రైమ్, సస్పెన్స్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. యధార్థ ఘటనల ఆధారంగా రాసుకున్న కథ ఇది’ అన్నారు. ‘కామెడీ సహా అన్ని భావోద్వేగాలు కథలో ఉన్నాయి. ఇంటర్వెల్ సన్నివేశంలో మలుపునకు ఆశ్చర్యపోతారు. మా బ్యానర్లో తొలి చిత్రమే మంచి కథతో వస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని నిర్మాత చేతన్ మైసూర్య అన్నారు. రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : వెంకట హనుమ నారిశెట్టి, సంగీతం : గోపీ సుందర్.