ముంబై: బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tandon) ఈ వారం ప్రారంభంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె దేశం కోసం ఏం చేసిందని పద్మశ్రీ అవార్డు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఆమె తాహతుకు పద్మశ్రీ అవసరమా అని ఎద్దేవా చేస్తున్నారు. సినిమాల్లో అందాలు ఆరబోసే నటీమణికి ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకునే అర్హత ఉందా అని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ పత్రికకు రవీనా టాండన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె తనపై వస్తున్న ట్రోల్స్పై స్పందించారు. తనను ట్రోల్ చేసేవాళ్లు కేవలం తన గ్లామర్ను మాత్రమే చూస్తున్నారని, ఆ గ్లామర్ వెనుక ఉన్న హార్డ్ వర్క్ను, దీర్ఘకాలిక శ్రమను గుర్తించడం లేదని వ్యాఖ్యానించారు. అలాంటి ట్రోల్స్కు తాను అంతగా ప్రాముఖ్యం ఇవ్వదల్చుకోలేదని పేర్కొన్నారు.
అంతేగాక తాను సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాలేదని, పలు సామాజిక స్పృహ ఉన్న సినిమాల్లో కూడా నటించానని చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనపై వచ్చిన మాత్ర్ (Maatr) సినిమాలో కూడా తాను నటించి మెప్పించానని రవీనా టాండన్ తెలిపారు. నాకు పద్మశ్రీ రావడంపై కొందరు ట్రోల్ చేస్తున్నా, చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు.