మలయాళంలో లేటెస్ట్ హిట్ ‘ప్రేమలు’ చిత్రంతో యువతరం గుండెల్లో గూడు కట్టేసుకుంది మమితా బైజు. కేవలం ఈ అమ్మాయి కోసమే ‘ప్రేమలు’ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తున్నారు యూత్. ప్రస్తుతం ఈ కేరళ అందాన్ని తెలుగులోకి లాగేయడానికి చాలామంది దర్శక, నిర్మాతలు ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారని సమాచారం. ఇదిలావుంటే.. రీసెంట్గా ఓ వేడుకలో పాల్గొన్న ఈ బంగారు బొమ్మ తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ‘చిన్నప్పట్నుంచీ యాక్టింగ్ అంటే ఇష్టం. ‘సర్వోపరి పలక్కరన్’ నా తొలి సినిమా. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాను. షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను. కానీ ‘ప్రేమలు’ నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. తమిళంలో జీవీ ప్రకాష్కుమార్ హీరోగా నటిస్తున్న ‘రెబల్’ సినిమాలో చేస్తున్నాను. అవకాశాలు చాలానే వస్తున్నాయి కానీ, అన్నీ చేయను. నచ్చితేనే చేస్తా.’ అంటూ చెప్పుకొచ్చింది మమిత. మిమ్మల్ని చాలామంది సాయిపల్లవితో పోలుస్తున్నారు? పైగా మీరే సాయిపల్లవికి సరైన పోటీ అనే టాక్ కూడా నడుస్తున్నది? దీనిపై మీ అభిప్రాయం? అనడిగితే ‘ఆమె గ్రేట్ ఆర్టిస్ట్. నాకు ఇన్స్పిరేషన్. అలాంటి మంచి యాక్ట్రస్తో పోలుస్తున్నారంటే ఆనందమేగా!? ఇక పోటీ అంటారా? నా కెరీర్ మొదలైందే ఇప్పుడు.. అప్పుడే పోటీ దాకా ఎందుకు..’ అంటూ అందంగా నవ్వేసింది మమిత.