అగ్ర కథానాయిక కీర్తి సురేష్ తెలుగులో మరో భారీ ఆఫర్ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. యువ హీరో నాగచైతన్యతో ఈ చెన్నై సుందరి జోడీ కట్టబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించనున్నారు. మత్స్యకారుల నేపథ్య కథాంశంతో యథార్థ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఈ సినిమాలో కథానాయిక ఎంపిక కోసం చిత్ర బృందం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్, సాయిపల్లవి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలిసింది. త్వరలో ఈ చిత్రం సెట్స్మీదకు వెళ్లనుంది. ఇటీవల విడుదలైన ‘భోళా శంకర్’ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా చక్కటి అభినయంతో ఆకట్టుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ భామ తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నది.