ముంబై: బాలీవుడ్ అందాల భామ, దర్శకురాలు కంగనా రనౌత్ మళ్లీ ట్విటర్లో ప్రత్యక్షమయ్యింది. ఈ మేరకు మంగళవారం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో కమ్బ్యాక్ ట్వీట్ చేసింది. ‘హలో ఎవ్రీవన్, ఇట్స్ నైస్ టు బి బ్యాక్ హియర్’ అంటూ పలుకరించింది. అంతేగాక ఆమె రాబోయే సినిమా ‘ఎమర్జెన్సీ’కి సంబంధించిన బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) వీడియో ఇమేజ్ను ట్విటర్లో షేర్ చేసింది.
దానికి ‘ఎమర్జెన్సీ సినిమా నిర్మాణం పూర్తయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 20న సినిమా హాళ్లో కలుద్దాం (అండ్ ఇట్స్ ఎ వ్రాప్ !!! ఎమర్జెన్సీ ఫిల్మింగ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ.. సీ యు ఇన్ సినిమాస్ ఆన్ 20యత్ అక్టోబర్ 2023)’ అని క్యాప్షన్ ఇచ్చింది. అందాల నటి మళ్లీ ట్విటర్లోకి వచ్చినట్లు ట్వీట్ చేయడంతో ఆమెకు వెల్కమ్ బ్యాక్ అంటూ రిప్లై ఇవ్వడానికి అభిమానులు పోటీపడుతున్నారు.
కాగా, గత ఏడాది మే నెలలో ట్విటర్ కంగనా రనౌత్ ఖాతాను సస్పెండ్ చేసింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జి విజయం సాధించిన సందర్భంగా ఆమెకు వ్యతిరేకంగా కంగనా ట్వీట్ల వర్షం కురిపించింది. ఒక దశలో మమత బెనర్జి ప్రభుత్వాన్ని కూలదోసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. ఆమె ట్వీట్లు వివాదాస్పదం కావడంతో ట్విట్ ఆమె ఖాతాను నిలిపేసింది. ఇప్పుడు యాజమాన్యం మారడంతో ఎలాన్ మస్క్ కంగనాపై సస్పెన్షన్ను ఎత్తేశారు.