హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ మాఫియాకు చెందిన కెల్విన్ మీకు ఎలా పరిచయం? అతడి బ్యాంక్ ఖాతాల్లోకి మీరు ఎందుకు డబ్బులు పంపించారు? అతడి నుంచి మీరు డ్రగ్స్ కొనుగోలు చేశారా? వాట్సప్లో అతడితో పలుసార్లు ఎందుకు చాట్ చేశారు?..మీ ఫోన్ నంబర్ను కెల్విన్ తన ఫోన్ లో దాదా పేరిట ఎందుకు ఫీడ్ చేసుకున్నాడు? అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు నటి చార్మికౌర్పై ప్రశ్నల వర్షం కురిపించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ జరిగి ఉంటుందన్న అనుమానాలతో ఈడీ అధికారులు పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజు దర్శకుడు పూరీజగన్నాథ్ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు పలు కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. రెండోరోజు విచారణకు నటి చార్మి హాజరయ్యారు. గురువారం ఉదయం 10-30 గంటలకు నాంపల్లిలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన నటి చార్మిని దాదాపు ఆరు గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన విరామం మినహా నటి చార్మిని ప్రశ్నిస్తూనే ఉన్నట్టు తెలిసింది. బ్యాంకు లావాదేవీల పత్రాలు సైతం చార్మి అధికారులకు సమర్పించింది.
వందలసార్లు లావాదేవీలు…?
టాలీవుడ్ డ్రగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కెల్విన్కు సంబంధించి మూడు బ్యాంక్ ఖాతాలను ఇప్పటికే ఈడీ అధికారులు ఫ్రీజ్ చేసినట్టు తెలిసింది. ఆ ఖాతాలకు ఎవరెవరి నుంచి డబ్బులు వచ్చాయన్నదాన్ని ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నటి చార్మి బ్యాంక్ ఖాతాల నుంచి 2015 నుంచి 2017 మధ్య వందకుపైగా లావాదేవీలు ఉన్నట్టుగా ఈడీ వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. కొన్ని అనుమానాస్పద లావాదేవీలపై చార్మిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసిం ది. కెల్విన్ ఎవరో తనకు తెలియదని.. తనకు ఆ వివరాలేవీ తెలియదంటూ దాటవేసేందుకు చార్మి ప్రయత్నించగా.. పూర్తి పత్రాలను ముందుంచి ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. మరికొన్ని వివరాలు కావాలని ఈడీ అధికారులు కోరినట్టు తెలిసింది.
నేను ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తా..
‘ఈడీ అడిగిన అన్ని డాక్యుమెంట్లు సమర్పించాను. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను ఈడీ అధికారులకు పూర్తిగా సహకరిస్తాను..’అని ఈడీ విచారణ అనంతరం మీడియాతో చార్మి అన్నారు.
నేడు ఈడీ విచారణకు రకుల్ ప్రీత్సింగ్!
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సినీనటి రకుల్ ప్రీత్సింగ్ శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరుకానున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగత పనుల కారణంగా ఈ నెల 6 హాజరుకాలేనని, ఆ తర్వాత విచారణకు వస్తానని రకుల్ ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. మరికొందరిని ప్రశ్నించాల్సి ఉన్నందున శుక్రవారం హాజరుకావా లని అధికారులు సూచించినట్టు సమాచారం. 2017లో ఎక్సైజ్శాఖ అధికారులు నమోదుచేసిన కేసులో రకుల్ ప్రీత్సింగ్ పేరు లేదు. తాజాగా రకుల్కు అధికారులు ఎందుకు నోటీసులు ఇచ్చారు? ఆమె నుంచి ఏ సమాచారం తీసుకోనున్నారన్నది ఆసక్తిగా మారింది.