‘వకీల్సాబ్’ చిత్రాన్ని ‘పింక్’ సినిమాతో పోల్చిచూడొద్దు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథను అద్భుతంగా తీర్చిదిద్దారు’ అని చెప్పింది కథానాయిక అంజలి. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వకీల్సాబ్’. పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్వేణు దర్శకుడు. ఈ నెల 9న విడుదలకానుంది. గురువారం అంజలి పాత్రికేయులతో మాట్లాడుతూ ‘పవన్కల్యాణ్తో సినిమా అనగానే చాలా ఎగ్జయిటింగ్గా అనిపించింది. ఆయన సెట్లో అడుగుపెడుతుంటే అందరూ నిశ్శబ్దంగా ఉండేవారు. సెట్లో పవన్కల్యాణ్ ప్రతి ఒక్కరితో హుందాగా, కూల్గా వ్యవహరిస్తారు. నా పాత్ర విషయంలో ఆయన ఎన్నో సూచనలిచ్చారు. మహిళల మీద జరిగే దాడులు మనకు సాధారణ వార్తలుగా మారిపోయాయి. ఒకవేళ మన ఇంట్లో అలాంటి సంఘటన జరిగితే ఎలా ప్రతిస్పందిస్తామనే అంశాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. అలాంటి దురదృష్టకర సందర్భాలు ఏ అమ్మాయికి రావొద్దని కోరుకుందాం. వేధింపుల విషయంలో సెలబ్రిటీలు, సాధారణ అమ్మాయిలు అనే తేడాలు ఉండవు. అన్ని చోట్ల మహిళలు ఒకే రకమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ప్రతి విషయంలో మహిళలకు స్వీయనిర్ణయాన్ని తీసుకునే హక్కు ఉంటుంది. అమ్మాయి నో చెప్పిందంటే ఆమె నిర్ణయానికి తిరుగుండదు. వారిని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. ఈ సినిమా అందించబోయే సందేశమదే’ అని చెప్పింది.