తమిళ హీరో సూర్య మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. బాల దర్శకత్వంలో ఆయన నటించబోతున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి నాయికగా నటిస్తున్నది. సూర్య, బాల కాంబినేషన్లో 18 ఏళ్ల కిందట ‘శివపుత్రుడు’ సినిమా తెరకెక్కి ఘనవిజయం సాధించింది. మళ్లీ ఇన్నేళ్ల విరామం తర్వాత వీరు కలిసి సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. ఉద్వేగభరిత కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థలో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. సూర్య నటిస్తున్న ఈ 41వ సినిమా చిత్రీకరణ తాజాగా కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సూర్య స్పందిస్తూ…‘దర్శకుడు బాల నాకు గురువు లాంటి వారు. 18 ఏళ్ల తర్వాత మేము కలిసి సినిమా చేస్తున్నాం. ఆయనతో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణియం.