ముంబై: తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి మూడు రాష్ట్రాల ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసిన అలనాటి నటి, భరతనాట్యం నృత్యకారిణి శోభనకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొత్తగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. కరోనా కారణంగా కీళ్ల నొప్పులు, మంటలు కూడా వేధిస్తున్నాయని ఆమె తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా వెల్లడించింది. తాను రెండు డోసుల టీకాలను, అన్ని ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నానని, అయినా కొవిడ్ బారినపడ్డానని శోభన ఇన్స్టాలో పేర్కొన్నారు.
‘నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారినపడ్డా. మొదటి రోజు కీళ్లలో నొప్పి, మంట పుట్టాయి. గొంతులో దురదగా, నొప్పిగా అనిపించింది. క్రమంగా ఈ లక్షణాలు తగ్గుతూ వచ్చాయి’ అని శోభన తెలిపింది. తాను రెండు డోసుల టీకాలు తీసుకున్నందున ప్రమాదమేమీ ఉండదన్న ఆమె.. అందరూ తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలని సూచించింది. అంతేగాక ఈ ఒమిక్రాన్ వేరియంట్తోనే కరోనా అంతమవుతుందని ఆశిస్తున్నట్లు ఆమె ఇన్స్టాలో రాసుకొచ్చింది.