‘నా మనఃసాక్షి ప్రకారమే సినిమా కథల్ని ఎంపిక చేసుకుంటా. ఏదైనా రాసిపెట్టుంటే తప్పకుండా జరిగి తీరుతుందనే సూత్రాన్ని నేను నమ్ముతాను. విశ్వం అందించే రహస్య సందేశాల్ని అర్థం చేసుకుంటే అంతా సవ్యంగానే ఉంటుంది’ అంటూ కాస్త తాత్వికత కలబోసిన స్టేట్మెంట్ ఇచ్చింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. చిత్రసీమలో ఐదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ కన్నడ సోయగం దక్షిణాదిన అగ్ర నాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ‘గుడ్బై’ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా రష్మిక మందన్న తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ ‘ఏ రంగంలోనైనా విజయం కోసం రిస్క్ తీసుకోవాల్సిందే.
మన నిర్ణయాలు సరైనవో కావో కాలం మాత్రమే నిర్ణయించగలదు. ఓ నటిగా వచ్చిన అవకాశాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసుకోవడంపైనే దృష్టిపెడతాను. నా నటన చూసి ప్రేక్షకుల మోములపై చిరునవ్వులు వికసిస్తే అదే విజయంగా భావిస్తా’ అని చెప్పింది. ‘గుడ్బై’ సినిమాలో అమితాబ్బచ్చన్ వంటి లెజెండ్తో కలిసి నటించడం ఓ జీవితకాల అనుభవమని, తన స్వప్నం సాకారమైందనే భావన కలిగిందని సంతోషం వ్యక్తం చేసింది రష్మిక మందన్న. ‘గుడ్బై’ చిత్రం అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.