Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్ కేసులో నేడు ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నటుడు ప్రకాశ్ రాజ్తో పాటు పలువురు నటులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మేరకు బుధవారం ప్రకాశ్ రాజ్ హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ సెలబ్రిటీలపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ యాప్ల ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే హీరోలు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, నటి మంచు లక్ష్మి వంటి వారికి కూడా ఈడీ నోటీసులు పంపింది. రానా దగ్గుబాటి ఇప్పటికే విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. సినిమా షూటింగ్లు ఉండడంతో విచారణకు మరికొంత సమయం కోరాడు. కాగా, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాల్సి ఉంది.