పార్వతీశం, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి వెంకటరమణ.ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ హరియాల, తాలబత్తుల మాధవి నిర్మాతలు. వేదుల బాలకామేశ్వరి సమర్పకురాలు. సామాజిక నేపథ్యమున్న ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతున్నది. ఈ చిత్ర వివరాలను చిత్రబృందం తెలిపారు. దర్శకుడు వెంకటరమణ ఎస్ మాట్లాడుతూ..‘ప్రతి మనిషి గౌరవంగా బతకాలి, గౌరవంగా మరణించాలి అని మన రాజ్యాంగం చెబుతున్నది.
అందుకు వ్యతిరేకంగా ఏర్పడే సామాజిక పరిస్థితులను ప్రశ్నిస్తుందీ చిత్రం. సామాజిక సందేశంతో పాటు మంచి ప్రేమకథను చూపిస్తున్నాం. ఈ నెల 25వ తేదీ నుంచి కాకినాడ, యానాం తదితర ప్రాంతాల్లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. నిర్మాత సిద్ధార్థ హరియాల మాట్లాడుతూ…‘సామాజిక నేపథ్యమున్న కమర్షియల్ చిత్రమిది. రెండు షెడ్యూల్స్లో 50 రోజుల చిత్రీకరణతో సినిమాను పూర్తిచేయబోతున్నాం’ అన్నారు. రామరాజు, చక్రపాణి, రంగస్థలం లక్ష్మి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : సురేష్ కుమార్ వై, సినిమాటోగ్రఫీ : జి. అమర్.