గత నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని నాగబాబు చేసిన వ్యాఖ్యలు తనను షాక్ గురిచేశాయన్నారు ‘మా’ అధ్యక్షుడు, సినీనటుడు నరేష్. తాము చేస్తున్న పనుల గురించి చిరంజీవితో పాటు సినీపెద్దలందరికీ ఎప్పటికప్పుడూ చెబుతూనే ఉన్నామని.. అన్నీ తెలిసి కూడా నాగబాబు ఇలా వ్యాఖ్యానించడం తప్పని ఆయన పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాల్ని సభ్యులందరికీ అందజేస్తామని నరేష్ చెప్పారు. ‘మా’ మసకబారిపోయిందనే ఆరోపణలపై నాగబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్చేశారు. ఇటీవల ప్రకాష్రాజ్ ప్యానల్కు మద్దతిస్తూ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై శనివారం నరేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘నాకు కథలు చెప్పడం రాదు. కాగితాలతో రావడం అలవాటు. నిజాలు చెప్పడానికే అందరి ముందుకొచ్చా. కాలుదువ్వడానికి.. దూషించడానికి రాలేదు. నన్ను ప్రెసిడెంట్ను చేయమని ఎవరినీ అడగలేదు. నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ కాలేవు అని నాతో చాలా మంది అన్నారు. మార్పు కోసం మంచి ఉద్దేశంతో ప్రజాస్వామ్యబద్దంగా గెలిచి అధ్యక్షుడినయ్యా. అధికారదాహం నాకు లేదు. విజన్తోనే వచ్చా.నేను ఏమిటనేది చెప్పుకోవలసిన అవసరం లేదు. లోకల్, నాన్లోకల్ అనే మాటలు మేము ఎప్పుడూ అనలేదు. అలాగే ఒక కమిటీ అధికారంలో ఉండగానే అందులోని సభ్యులు మరో ప్యానల్లో చేరడం నన్ను బాధించింది. ప్రకాష్రాజ్ నాకు మంచి మిత్రుడు. మూడు నెలల క్రితం ఫోన్ చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పారు. ‘తెలుగు సినిమాల్లో నటించిన వారెవరికైనా ‘మా’ ఎన్నికల్లో పోటీచేసే హక్కు ఉంది. ఎవరొచ్చినా స్వాగతిస్తా’మని ప్రకాష్రాజ్కు చెప్పా. ‘మా’ రాజకీయ వ్యవస్థ కాదు. కృష్ణ, చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్బాబు, దాసరి నారాయణరావు ఒక్కొక్క ఇటుకను పేర్చి తెలుగు కళాకారుల సంక్షేమం కోసం మొదలుపెట్టిన సంస్థ ఇది. ఎవరు పోటీచేసినా మాకు సంతోషమే. నాలుగేళ్లలో ‘మా’ సభ్యులకు జీవితబీమా, చనిపోయిన 16 మంది కళాకారులకు యాభై లక్షల ఆర్థిక సహాయం, వృద్ధ కళాకారులకు పెన్షన్తో పాటు ఎన్నో మంచి పనులు చేశాం. మేము చేస్తున్న మంచి పనులు నచ్చి కొత్తగా 87 మంది సభ్యులు అసోసియేషన్లో చేరారు. ‘మా’ మసకబారితే వాళ్లంతా ఎలా చేరుతారని అడుగుతున్నా. మేము పదవుల్ని ఏ రోజు ఆశించలేదు. క్రమశిక్షణ కమిటీ ఎప్పుడు అడిగినా మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే కల్యాణి, శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు.