తమిళ హీరో కార్తీని వైవిధ్యమైన కథలకు చిరునామాగా అభివర్ణిస్తారు. కమర్షియల్ సినిమాల్లోనే పాత్రలపరంగా ప్రయోగాలు చేస్తుంటారు. ఆయన తాజా చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. దీపావళి కానుకగా విడుదలకానుంది. ఈ సందర్భంగా గురువారం హీరో కార్తీ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రాసుకున్న కథాంశమిది. దర్శకుడు రాజు మురుగన్ నిజజీవితంలో చూసిన అనుభవాలు ఇందులో ఉంటాయి. స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమా అనిపించింది. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. ‘జపాన్’ అని పేరేందుకు పెట్టామో సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాలో డార్క్ కామెడీతో పాటు మంచి సైటెర్ ఉంటుంది. మాస్ యాంగిల్తో పాటు చక్కటి వినోదం ఉన్న పాత్రను పోషించాను. ఈ సినిమాలో కొత్త కార్తీని చూస్తారు.
యూనివర్సల్ కాన్సెప్ట్
కొందరు వ్యక్తుల పర్సనాలిటీకి, వాళ్ల వాయిస్కు సంబంధం ఉండదు. మనిషి బలంగా ఉంటాడు కానీ వాయిస్ పీలగా ఉంటుంది. జపాన్ పాత్ర కోసం అలాగే ప్రయత్నించా. అది అద్భుతంగా కుదిరింది. ఈ సినిమాలో కామెడీతో పాటు నేటి సమాజాన్ని ప్రతిబింబించే అనేక అంశాలుంటాయి. వాటన్నింటిని వ్యంగ్యంగా చెప్పాం. యూనివర్సల్ కాన్సెప్ట్తో అందరికి కనెక్ట్ అవుతుంది. జీవీ ప్రకాష్కుమార్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు మరో ప్రపంచంలో విహరించిన అనుభూతినందిస్తుందీ చిత్రం.
‘ఖైదీ’కి సీక్వెల్..?
‘ఖైదీ-2’ కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ‘జపాన్’ చిత్రానికి కూడా సీక్వెల్ తీయాలని దర్శకుడికి చెప్పాను. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతం ‘సూదుకవ్వం’ దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. అలాగే ‘96’ దర్శకుడుప్రేమ్కుమార్తో కూడా ఓ చిత్రం ఉంటుంది. ‘సర్దార్-2’ సినిమా కూడా చేయబోతున్నా. ఆ వివరాలన్నీ త్వరలో తెలియజేస్తా.