Actor Darshan | అభిమాని హత్యకేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్ తూగుదీప కోర్టును ఆశ్రయించారు. జైలులో భోజనం తనకు అరగడం లేదని.. బరువు సైతం తగ్గిపోయానని.. ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. నటుడి పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. చిత్రదుర్గకు రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్ తూగుదీప, నటి పవిత్ర గౌడ్ జూన్ 10న అరెస్టయిన విషయం తెలిసినందే.
జ్యుడీషియల్ కస్టడీలో ప్రస్తుతం పరప్పన అగ్రహాల జైలులో ఉన్నారు. గతంలోనూ దర్శన్ ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. సాంకేతిక కారణాలతో ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. తాజాగా మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ ఎం నాగప్రసన్న జైలులో ఖైదీలందరికీ పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జైలు నిబంధనల ప్రకారం.. ఇంటి భోజనానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. దర్శన్కు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలో చెప్పాలని ఆదేశిస్తూ పది రోజుల సమయం ఇచ్చారు. కేసు విచారణను వాయిదా వేశారు.